చాట్రాయిలో టీడీపీ దళిత నాయకుల ఆత్మీయ కలయిక
దళిత హక్కులు, రాజకీయ ప్రాధాన్యతపై విస్తృత చర్చ
ఏలూరు జిల్లా, చాట్రాయి:
చాట్రాయి మండలంలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకుల ఆత్మీయ కలయిక కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గడ్డం రమేష్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గార్లపాటి మారేష్, నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యం వహించారు.
నూజివీడు నియోజకవర్గ పరిధిలోని దళిత నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు వంద మంది దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళితుల న్యాయపరమైన హక్కులు, ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య రంగాల్లో వారికి అందాల్సిన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
గ్రామాల అభివృద్ధిలో దళిత నాయకుల పాత్రకు ప్రాధాన్యత కల్పించాలని, పార్టీ కోసం కష్టపడుతున్న దళిత నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత అవకాశాలు కల్పించాలని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రతి గ్రామంలో దళితుల ఓట్లు గణనీయంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన గుర్తింపు లభించడం లేదని నాయకులు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితులు ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దళితుల అభివృద్ధికి మంత్రి కొలుసు పార్థసారథి అనుకూలంగా పనిచేస్తున్నారని, దళితుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్ రామ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రి కొలుసు పార్థసారథిల సేవలను నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో దుర్గం పుల్లారావు, శేఖర్, కోట జోజి, కొమ్ము ప్రసాద్, మోదుగు ముత్తయ్య, కొమ్ము సృజన రావు, మోషే తదితర దళిత నాయకులు పాల్గొని ప్రసంగించారు.