అమరావతి: ఏపీలో రేషన్ విధానంలో కొత్త మార్పులు..
అమరావతి: ఏపీలో రేషన్ విధానంలో కొత్త మార్పులు.. బియ్యం తీసుకోని వారికి డిజిటల్ రూపంలో నగదు బదిలీ?
ఆంధ్రప్రదేశ్లో సీబీడీసీ (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ) విధానం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డులు కలిగిన వారికి, ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకోని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా నగదు బదిలీ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, అదే తరహాలో రాష్ట్రంలోనూ అమలు చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధికారులు ఇటీవల గుజరాత్ వెళ్లి అక్కడ సీబీడీసీ అమలు విధానం, సాంకేతిక ప్రక్రియలను అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.
తొలి దశలో విశాఖపట్నంలో సీబీడీసీ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రయోగాత్మక అమలు ఫలితాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.
సీబీడీసీ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక, నగదు బదిలీ విధానం తదితర అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు బియ్యం అవసరం లేని వారికి ప్రత్యామ్నాయ ప్రయోజనం అందించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.