అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు
అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు – సూరంపాలెంలో సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ సూచించారు. విగ్రహానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తగిన లైటింగ్ సదుపాయం కల్పించాలని ఆయన గ్రామస్తులకు తెలిపారు.
అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలను సమన్వయంతో నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు శాంతియుతంగా జరగేలా చూడాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అందరూ ఐక్యమత్యంతో ముందుకు రావాలని హెచ్చరించారు. ఏవైనా అశాంతి పరిస్థితులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాలయోధుల సంఘం సభ్యులు నక్కా రాము, దార్ల సురేష్ బాబు, నక్కా చెన్నారావు, ముండ్రు వెంకటేశ్వరరావు, జక్కం కాంతారావు, దార్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూరంపాలెం యూత్ సభ్యులు కూడా హాజరై అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు.