www.ntodaynews.com
కార్మిక–రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
తెలంగాణ
కార్మిక–రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి: ర్యాకల శ్రీశైలం డిమాండ్
NTODAY NEWS: బొమ్మలరామారం మండలం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ర్యాకల శ్రీశైలం డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపు మేరకు గురువారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని గుడిబావి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు.
ఈ సమ్మె కేవలం కార్మిక సంఘాల హక్కుల కోసం మాత్రమే కాకుండా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించినదని తెలిపారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా కొత్త విత్తన చట్టం, విద్యుత్ చట్ట సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ కార్మికుల పనిహక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు.
మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
#Bommalramaram #FarmersProtest #WorkersRights #LabourCodes #NationwideStrike #TelanganaNews #PublicIssues
Follow us on
Website
Facebook
Instagram
YouTube