శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి పార్థసారధి కి ఆహ్వానం
అపర భద్రాద్రి గా పేరొందిన చనుబండ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి పార్థసారధి కి ఆహ్వానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథిని టిడిపి సీనియర్ నాయకులు, ఆర్.బి.ఎస్ జాతీయ అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు పట్టు వస్త్రాలతో సన్మానించారు. 17వ శతాబ్దానికి చెందిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం చనుబండలో అపార భక్తి విశ్వాసాలతో వెలుగొందుతుండటం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా విశేష గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు విచ్చేయాలని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి మంత్రి పార్థసారథిని ఆహ్వానించారు. కార్యక్రమంలో నరసాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగరాజు, చెన్నారావు, నారాయణ, నరసింహారావు, చాట్రాయి మండల మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, చనుబండ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వర రావు, మోరంపూడి రమేష్, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 27వ తేదీ బుధవారం నుండి 30వ తేదీ సోమవారం వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. శ్రీ స్వామివారి తిరుకళ్యాణం 27వ తేదీ శుక్రవారం ఉదయం 12 గంటల 35 నిమిషాలకు జరగనుంది.
చైత్ర శుద్ధ సప్తమి నుండి ద్వాదశి వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఖమ్మం వాస్తవ్యులు శ్రీమాన్ యతిరాజా నచ్చికేతనాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగనున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.