అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
ఎస్ఐఆర్ విచారణ ప్రక్రియను పరిశీలించిన
కలెక్టర్ సత్యప్రసాద్,
మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి
గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల పరిశీలన
ధర్మపురి:
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను శుక్రవారం ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులు, విచారణ ప్రక్రియ, ఓటర్ల నుంచి సేకరిస్తున్న ఆధారాలు, ఆన్లైన్లో వివరాల నమోదును కలెక్టర్ ఆరా తీశారు. ఎస్ఐఆర్ సర్వే పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.
పుష్కర ఘాట్ల పనులు వేగవంతం చేయాలి
అనంతరం 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి గోదావరి తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ పరిశీలించారు. భక్తులు, వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ మహేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.