బాధితుడికి అండగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు.. అటవీ జంతువు దాడిలో గొర్రెలు కోల్పోయిన కుటుంబానికి రూ.1.25 లక్షల చెక్కు పంపిణీ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాలలో ఇటీవల గుర్తుతెలియని అటవీ జంతువు దాడిలో 45 గొర్రెలను కోల్పోయిన బాధితుడు పొనవేణి రాజబాపుకు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు తక్షణ ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. తన జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో తీవ్ర నష్టాల్లో ఉన్న బాధితుడు రాజబాపు తన ఆవేదనను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి, బాధితునికి నష్టపరిహారం అందేలా చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుండి మంజూరైన ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయల (రూ. 1,25,000/-) చెక్కును ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు బాధితునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ గారు పాల్గొన్నారు. వారితో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గారు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు