బాకీ వివాదం.. వివాహిత హత్య..
బాకీ వివాదం.. వివాహిత హత్య.. కాలువ సమీపంలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి
ఏలూరు జిల్లా, నూజివీడు: బాకీ డబ్బుల వివాదం నేపథ్యంలో ఓ వివాహితను హత్య చేసి, శవాన్ని పాతిపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్లూరు శివారు శౌరిపురానికి చెందిన వైశాలి (34) గత నెల 18వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు, వైశాలి ఫోన్ కాల్ వివరాల ఆధారంగా అదే గ్రామానికి చెందిన ఫ్రాన్సిస్ శౌరిని అనుమానితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, బాకీ డబ్బుల వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా వైశాలిని నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ శివారులోని పోలవరం కాలువ ప్రాంతానికి రప్పించి హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం శవాన్ని అక్కడే పాతిపెట్టినట్లు తెలిపిన నేపథ్యంలో, పోలీసులు గురువారం శవాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని డీఎస్పీలు శ్రావణ్ కుమార్, కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్ సీఐ ఐ.వి. నాగేంద్ర కుమార్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.