జీవో 396కు వ్యతిరేకంగా జూలై 20 నుంచి పెన్డౌన్ సమ్మె: గిద్దలూరు దస్తావేజు లేఖరుల సంఘం
గిద్దలూరు: రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.396 అమలుకు వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి 31 వరకు చేపట్టనున్న పెన్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిద్దలూరు దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు కోరే సుబ్బారావు పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం సంఘం కార్యదర్శి గర్రె రామ్ ప్రసాద్ కార్యాలయంలో నిర్వహించిన దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 అమలైతే దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణతో ప్రజల ఆస్తుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 396ను ఉపసంహరించుకుని, ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 20 నుంచి 31 వరకు జరిగే పెన్డౌన్ సమ్మెను విజయవంతం చేసేందుకు సభ్యులందరూ కృషి చేయాలని, సమ్మె ఉద్దేశాన్ని ప్రజలకు, కక్షిదారులకు వివరించాలని కోరారు. సమావేశంలో దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు పాల్గొన్నారు.