బీసీల అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంది: మంత్రి పార్థసారథి
బీసీల అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంది: మంత్రి పార్థసారథి
జగన్ వ్యాఖ్యలు ఆవు కథలా ఉన్నాయి.. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
అమరావతి: బీసీల సంక్షేమం, రిజర్వేషన్ల విషయంలో టీడీపీకి పూర్తి చిత్తశుద్ధి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.
మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి ఆవు కథను తలపిస్తున్నాయని పార్థసారథి ఎద్దేవా చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన పోరాటం చేయలేదని ఆరోపించారు. గత పాలనలో బీసీ నేతలు స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెల్లడించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు.
బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం అందించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.