బహుముఖ ప్రజ్ఞాశాలి కోన ప్రభాకరరావుకు ఘన నివాళి
పెనుగొలను, జూలై 10: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు కోన ప్రభాకరరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోన ప్రభాకరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మాజీ సర్పంచి సంగెపు నారాయణ మాట్లాడుతూ, కోన ప్రభాకరరావు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం గడిపిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా, రాష్ట్ర మంత్రిగా, అలాగే సిక్కిం, మహారాష్ట్ర రాష్ట్రాల గవర్నర్గా విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు.
విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, కోన ప్రభాకరరావు రాజకీయ నాయకుడిగానే కాకుండా న్యాయవాది, క్రీడాకారుడు, నటుడు, దర్శకుడు, రచయితగా కూడా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న మహనీయుడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి కాన్వెంట్ ప్రిన్సిపాల్ డి. వీరయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.