పెనుగొలనులో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ
గంపలగూడెం, జూలై 10: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవల మరణించిన ప్రధానోపాధ్యాయులు యన్నం రంగారెడ్డి జ్ఞాపకార్థం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, దాతలు అందించిన సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, కీర్తిశేషులు యన్నం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా సేవలందించి మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. వారి జ్ఞాపకార్థం శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.