బోరుబావుల కింద వరి సాగుకు బ్రేక్.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
బోరుబావుల కింద వరి సాగుకు బ్రేక్.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
తెలంగాణలో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన, సెప్టెంబర్ నుంచి వర్షాభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, ఎల్-నినో ప్రభావం యాసంగి సీజన్ వరకు కొనసాగవచ్చని హెచ్చరించారు.
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బోరుబావులపై ఆధారపడి వరి, పత్తి వంటి అధిక నీటి అవసరమున్న పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
దానికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని మంత్రి తెలిపారు.