భార్యపై అనుమానం… వ్యక్తిపై గొడ్డలితో హత్యాయత్నం
భార్యపై అనుమానం… వ్యక్తిపై గొడ్డలితో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – ఆస్పత్రిలో చికిత్సలో బాధితుడు
ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు: మండలంలోని పెద్దతండా గ్రామ శివార్లలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏ.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన క్రైమ్ నెంబర్ 21/2026, U/S 109 బిఎన్ఎస్ కేసుకు సంబంధించి లావూరి సీతారాం (37)ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం… కుటుంబ సమస్యలు, భార్యపై అనుమానం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు చీమలపాడు గ్రామానికి చెందిన పాఠాపంచల జమలయ్య (40)తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో సీతారాం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో బాధితుడిపై ద్వేషం పెంచుకొని ముందుగా ప్రణాళిక ప్రకారం దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఘటన జరిగిన రోజు పెద్దతండా గ్రామ శివార్లలోని ఎన్ఎస్పీ కాలువ సమీపంలో బాధితుడిని అడ్డగించి, తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు తలకు, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలు పొందడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విచారణలో భాగంగా నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చట్టపరమైన విధానంలో అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ… వ్యక్తిగత వివాదాలను హింసాత్మక మార్గాల్లో కాకుండా చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.