భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ.
మదనపల్లి, సమాజ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు కొనియాడారు. శనివారం పోలీసు సమావేశ మందిరంలో ఏఎస్ఐలు ఎస్. మాబూ సాహెబ్, పి. వెంకటరమణ, మరియు ఎం. శేఖర్ రావులకు 'ఆత్మీయ వీడ్కోలు' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారుల సుదీర్ఘ సర్వీసులో వారి జీవిత భాగస్వాముల సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అభినందించారు. శేష జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన వారికి జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.