భూ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ నృసింహాద్రి శ్రీనివాసరావుకు ఘన నివాళి
తిరువూరు, జూలై 24: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం పెద్దవరం గ్రామంలో భూ పోరాట యోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకుడు, అమరజీవి కామ్రేడ్ నృసింహాద్రి శ్రీనివాసరావు 14వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్దవరం గ్రామంలోని ఆయన నివాస ఆవరణలో ఏర్పాటు చేసిన కామ్రేడ్ స్తూపం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన చేసిన ప్రజా పోరాటాలను స్మరించుకున్నారు.
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తూము కృష్ణయ్య మాట్లాడుతూ నృసింహాద్రి శ్రీనివాసరావు జీవితమంతా పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం అంకితభావంతో పోరాడారని అన్నారు. పెద్దవరం గ్రామానికి రెండుసార్లు గ్రామ ప్రెసిడెంట్గా ఎన్నికై ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. గ్రామంలో భూ పోరాటాలకు నాయకత్వం వహించి, కులమతాలకు అతీతంగా సుమారు 300 ఎకరాల భూమిని పేదలకు అందించేలా కృషి చేసి సామాజిక న్యాయం సాధనకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ నృసింహాద్రి శ్రీనివాసరావు పేరు భూ పోరాటాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎన్. వనమాలి, గ్రామ శాఖ కార్యదర్శి పగిటిమిల్లి రవి, మారిపోగు పుల్లయ్య, కస్తూరి, ఎన్. శ్రీదేవి, చిన్న నాగరాజు, పార్టీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.