భూమిలో అక్రమంగా రహదారి వేసి అడ్డుకుంటున్నారని రైతు కుటుంబం ఆరోపణ
అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పోలవరపు రమాదేవి, భర్త దయాకరరావు తమ వ్యవసాయ భూమిలో అక్రమంగా రహదారి నిర్మించి, దానిని తొలగించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, యల్లాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు 2 ఎకరాల 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, అందులో పామాయిల్ తోట సాగు చేస్తున్నామని తెలిపారు. తమ భూమి సరిహద్దులో ఉన్న ఇరిగేషన్ కాలువపై కొందరు రైతులు పైపులు వేసి, అనుమతి లేకుండా భూమిలోకి రహదారి ఏర్పాటు చేశారని ఆరోపించారు.
ఈ విషయాన్ని గుర్తించిన అనంతరం శుక్రవారం జేసీబీ సహాయంతో ఆ రహదారిని తొలగించి గట్టు నిర్మించే పనులు చేపట్టగా, మల్లినేని మురళీ, మూతినేని ప్రభాకర్, మూతినేని కిషోర్తో పాటు పక్క తోట కౌలు రైతు కలిసి పనులను అడ్డుకున్నారని తెలిపారు. జేసీబీకి నష్టం కలిగించడంతో పాటు సామాన్లు దొంగిలించారని, వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
తమ భూమిలో పనులు నిలిపివేయడమే కాకుండా ప్రశ్నించినందుకు దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారని, తల్లిని నెట్టివేసి ఇబ్బందులకు గురిచేశారని బాధితులు వాపోయారు.
ఈ ఘటనపై రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు వెంటనే స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.
వ్యక్తిగత భూమిలో అక్రమ రహదారి ఏర్పాటు, తొలగింపు పనులను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఈ ఘటన ముసునూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.