భూమిలో దాచిన రూ.5 లక్షలకు చెదలు.. రైతుకు ఊహించని షాక్!
భూమిలో దాచిన రూ.5 లక్షలకు చెదలు.. రైతుకు ఊహించని షాక్!
బాలోత్రా: దొంగల భయంతో భూమిలో దాచిన డబ్బు.. ఏళ్ల తర్వాత బయటపడటంతో ఆ రైతుకు ఊహించని షాక్ ఎదురైంది. రాజస్థాన్లోని బాలోత్రాకు చెందిన రైతు మంగీలాల్ ఒక ప్లాట్ను విక్రయించగా వచ్చిన సుమారు రూ.5 లక్షలను ఇంట్లో ఉంచితే చోరీకి గురవుతాయనే భయంతో నేలలో రహస్యంగా దాచినట్లు తెలుస్తోంది.
అయితే ఆ తర్వాత ఆ డబ్బును దాచిన ప్రదేశాన్ని మంగీలాల్ మరిచిపోయాడు. కొంతకాలం తర్వాత జరిగిన తవ్వకాల్లో అనుకోకుండా ఆ నగదు బయటపడింది. డబ్బు చేతికి దొరికిందన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. నేలలో ఎక్కువకాలం ఉండటంతో నోట్లను చెదలు తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్ని నోట్లు పూర్తిగా దెబ్బతినగా, వాటిపై ఉన్న సీరియల్ నంబర్లు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
దెబ్బతిన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకును ఆశ్రయించిన మంగీలాల్కు మరో నిరాశ ఎదురైనట్లు సమాచారం. నోట్ల పరిస్థితి, వాటి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో వాటిని స్వీకరించేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించినట్లు చెబుతున్నారు.
దీంతో చేతికి దొరికిన రూ.5 లక్షలు కళ్లముందే పనికిరాకుండా పోయే పరిస్థితి రావడంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దొంగల నుంచి కాపాడాలని భూమిలో దాచిన నగదే చివరకు చెదల పాలవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.