చాట్రాయి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఘన విజయం
IIIT ప్రవేశాల్లో నలుగురు విద్యార్థులకు సీట్లు – గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జూన్ 13: గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ప్రతిభతో ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) – IIIT ప్రవేశాల్లో సీట్లు సాధించి మండలానికి గౌరవం తీసుకొచ్చారు. చాట్రాయి మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు ఈ ఏడాది IIIT ప్రవేశాల్లో ఎంపికై అద్భుత విజయం నమోదు చేశారు.
విజేతల వివరాలు:
చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. జస్వంత్ ఒంగోలు IIIT క్యాంపస్లో సీటు సాధించాడు. చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి. మధులత కూడా ఒంగోలు క్యాంపస్లో ప్రవేశం పొందింది. అదే పాఠశాలకు చెందిన ఏ. కవిత ఇడుపులపాయ IIIT క్యాంపస్లో సీటు సాధించింది. పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గద్దల ఉజ్వల కౌశిక్ ఒంగోలు క్యాంపస్లో సీటు కైవసం చేసుకున్నాడు.
గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఇంతటి ప్రతిష్టాత్మక సీట్లు సాధించడం పట్ల మండల వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
అధికారులు, ఉపాధ్యాయుల స్పందన:
విద్యార్థుల విజయంపై మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీనివాస్, వి.ఎస్.వి. బ్రహ్మాచారి లు సంయుక్తంగా స్పందిస్తూ, విద్యార్థుల కృషి మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఈ ఫలితాలకు కారణమని తెలిపారు.
చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. కృష్ణయ్య, చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, పోలవరం జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడు ఆర్. శ్రీనివాసరావు లు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏదైనా సాధించగలరని ఈ ఫలితాలు నిరూపించాయని తెలిపారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు చాట్రాయి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మందపాటి బసవా రెడ్డి, చిన్నంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత అత్తులూరి శ్రీనివాస రావు పోలవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మరిడి వెంకటేశ్వర రావు (చిట్టిబాబు) లు ఇంతటి ఘన విజయాలు తమ మండలంలోని తమ తమ గ్రామాల పాఠశాలల నుంచి సాధించడంలో పర్యవేక్షించి కృషి చేసిన మండల విద్యాశాఖ అధికారులు మాసగిరి శ్రీనివాసరావు, వి ఎస్ వి బ్రహ్మాచారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి కృష్ణయ్య, లక్ష్మి, ఆర్ శ్రీనివాసరావులను, ఇంత ఘన విజయాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు