చాట్రాయిలో ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన
చాట్రాయి, జులై 26: రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతకుంట్ల వెంకటేశ్వరరావు సూచించారు.
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల విస్తరణ కార్యక్రమంలో భాగంగా కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన రైతు నరసింగు చెన్నారావు పొలంలో పామాయిల్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీపై వివిధ ఉద్యానవన పంటలను సాగు చేసుకునే అవకాశం రైతులకు అందుబాటులో ఉందన్నారు.
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం అందించే పంటలపై ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు తీసుకుని రైతులు సాగు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తారతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.