దళితుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వైఖరి
అంటరానితనాన్ని ప్రోత్సహించేలా పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దురదృష్టకరం
అసెంబ్లీలో స్పీకర్ను, వెలుపల మహిళా పోలీసులను అవమానించారు
చర్యలు తీసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు కాంగ్రెస్ నేతల వినతి
హైదరాబాద్: NTODAY News
శాసనసభలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసెంబ్లీ వెలుపల పోలీసులతో ఘర్షణకు దిగడం, దళితులు నడిచిన రహదారులను పసుపునీళ్లు, పాలతో శుద్ధి చేయడం వంటి చర్యలతో బీఆర్ఎస్ తన దళిత వ్యతిరేక, మహిళల పట్ల గౌరవం లేని వైఖరిని బయటపెట్టిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అణచివేత చర్యలకు తావులేదని పేర్కొన్నారు. దళితులు, మహిళల గౌరవం, ఆత్మగౌరవం మరియు భద్రతకు భరోసా కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లాను కోరారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ డా. కవంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితర ప్రజాప్రతినిధుల బృందం బుధవారం సాయంత్రం లోక్భవన్లో గవర్నర్ను కలసి వినతిపత్రం సమర్పించింది.
సభలో దళితులపై దాడి:
శాసనసభలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేతలు వినతిపత్రంలో స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి శాసనసభ స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన మృతిచెందిన తల్లిని ప్రస్తావిస్తూ చేసిన నిందలు దళిత సమాజాన్ని, మహిళ లోకాన్ని తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చొక్కా విప్పి పోలీసులపైకి..:
అసెంబ్లీ వెలుపల కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని మంత్రులు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు చొక్కా విప్పి విధుల్లో ఉన్న పోలీసులపైకి విసిరేశారని, పలువురు నేతలు భౌతిక దాడులకు పూనుకున్నారని తెలిపారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బందితోనూ అత్యంత హేయంగా, అనుచితంగా ప్రవర్తించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.