చాట్రాయిలో ఉపాధ్యాయ ఎస్టీయూ గర్జన..
చాట్రాయిలో ఉపాధ్యాయ ఎస్టీయూ గర్జన.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో బుధవారం ఎస్టీయూ మండల శాఖ కార్యవర్గ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. మండల శాఖ అధ్యక్షుడు జి. అమరయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఉపాధ్యాయుల హక్కుల సాధన దిశగా కీలకంగా మారింది. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల హాజరుతో సభకు ప్రత్యేక ఊపొచ్చింది.
ఈ సమావేశానికి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.ఆర్. పవన్ కుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి. మహేష్, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. రామ్, మండల ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహారావు, స్టేట్ కౌన్సిలర్ ఎస్.కె. మహబు తదితరులు హాజరై ఉపాధ్యాయ సమస్యలపై గట్టిగా స్వరం వినిపించారు. చాట్రాయి మండలంతో పాటు చింతలపూడి, ముసునూరు, నూజివీడు, లింగపాలెం మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా కే.ఆర్. పవన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యమాలు మళ్లీ ముదురుతున్నాయని, ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి. మహేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆర్థిక, సేవా హక్కుల పరిరక్షణకు 12వ పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. రాము మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇది ఉపాధ్యాయుల దీర్ఘకాలిక డిమాండ్ అని గుర్తుచేశారు.
మండల అధ్యక్షుడు జి. అమరయ్య మాట్లాడుతూ చాట్రాయి మండలంలో ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు అండగా నిలుస్తామని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమమే ఎస్టీయూ లక్ష్యమని అన్నారు.
సభ అనంతరం భోజన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఉపాధ్యాయులు ఐక్యతను చాటుతూ పాల్గొన్నారు. మొత్తం సుమారు 160 మంది ఉపాధ్యాయులు హాజరై సభను విజయవంతం చేయడం గమనార్హం.