చదువు మానేసిన వారికి ఏపీఓపీఎస్ఎస్ ద్వారా మరో అవకాశం: ఓరియెంటేషన్ కార్యక్రమం
ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం: శ్రీ విద్య హైస్కూల్, శ్రీ చక్ర వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓపీఎస్ఎస్) సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఒకరోజు ఓరియెంటేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ప్రభుత్వ పరీక్షల శాఖ సహాయ కమిషనర్ ఆర్. ఆశ, మండల విద్యాశాఖ అధికారులు జే. రవీంద్ర, కే. దుర్గారావు హాజరై సార్వత్రిక విద్యాపీఠం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. చదువు మధ్యలో మానేసిన వారికి ఏపీఓపీఎస్ఎస్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ఒకే సంవత్సరంలో విద్యను పూర్తి చేసుకునే వీలు కల్పించడం ఈ విధానంలోని ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఏపీఓపీఎస్ఎస్ ద్వారా విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ సేవలను పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏపీఓపీఎస్ఎస్కు సంబంధించిన బ్రోచర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చలసాని రత్నాకర్, కరస్పాండెంట్ సాయి సునంద, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.