చెక్ బౌన్స్ కేసులో భార్యాభర్తలకు ఏడాది జైలు శిక్ష
రూ. 60 లక్షల మొత్తం ఫిర్యాదుదారుకు చెల్లించాలని కోర్టు ఆదేశం
తీర్పునిచ్చిన మంచిర్యాల ద్వితీయ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె. నిరోష
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే క్రమంలో చెల్లని చెక్కులు (చెక్ బౌన్స్) ఇచ్చిన భార్యాభర్తలకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల కోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు తీసుకున్న రూ. 60 లక్షల అప్పు మొత్తాన్ని తిరిగి ఫిర్యాదుదారుకు చెల్లించాలని మంచిర్యాల ద్వితీయ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె. నిరోష ఆదేశించారు. కేసు వివరాల్లోకి వెళితే...
మంచిర్యాల పట్టణంలోని గౌతమీనగర్కు చెందిన తాటిపల్లి మంజుల, తన ఇంటి ఎదురుగా నివసించే రాచపూడి లలితకు గత 2016 సంవత్సరంలో అవసరాల నిమిత్తం రూ. 38 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఆ తర్వాత సదరు అప్పును తిరిగి చెల్లించాల్సిందిగా మంజుల కోరగా, లలిత ఆమెకు ఒక చెక్కును అందజేశారు. అయితే, ఆ చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితురాలు మంజుల తన న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించారు.
మరొక కేసులో భర్తకు సైతం శిక్ష:
ఇదే క్రమంలో రాచపూడి లలిత భర్త, ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రాచపూడి లక్ష్మీనారాయణ సైతం మంజుల వద్ద నుండి తన అవసరాల కొరకు రూ. 22 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు తీర్చకుండా మంజులను ఇబ్బంది పెట్టడంతో ఆమె మరో కేసులో కోర్టును ఆశ్రయించారు.
ఈ రెండు కేసులపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదోపవాదాలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి కె. నిరోష, నిందితులపై నేరం రుజువు కావడంతో భార్యాభర్తలిద్దరికీ చెరో ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేశారు. అలాగే వారు తీసుకున్న మొత్తం రూ. 60 లక్షలను (భార్య లలిత రూ. 38 లక్షలు, భర్త లక్ష్మీనారాయణ రూ. 22 లక్షలు) ఫిర్యాదుదారు తాటిపల్లి మంజులకు తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో ఫిర్యాదుదారు (బాధితురాలి) తరఫున సీనియర్ న్యాయవాది సిరిపురం రాజేష్, న్యాయవాది శ్రీరామ్ కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించారు