చిలకలూరిపేటలో విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్.. 562 కేసుల పరిష్కారం, రూ.1.78 కోట్ల రాజీ
చిలకలూరిపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొని పరస్పర అంగీకారంతో తమ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారు.
ఈ లోక్ అదాలత్లో మొత్తం 562 కేసులు పరిష్కారమవగా, రూ.1,78,77,543 విలువైన రాజీ ఒప్పందాలు నమోదైనట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.
పరిష్కారమైన కేసుల్లో 390 సమ్మరీ ట్రయల్ కేసులు, 117 క్రిమినల్ కేసులు, 44 సివిల్ కేసులు, 5 గృహ హింస కేసులు, 4 వైవాహిక కేసులు ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పలు కేసులు ఒకే వేదికపై పరిష్కారం కావడంతో కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ చైతన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. నరేంద్ర రెడ్డి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్.ఎం. సుభాని పాల్గొని కేసుల పరిష్కార ప్రక్రియను పర్యవేక్షించారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, పోలీసు శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులందరికీ న్యాయమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు.