పెనుగొలనులో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన.. గోమాతకు ప్రత్యేక పూజలు
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం: తిరువూరు నియోజకవర్గంలోని పెనుగొలను గ్రామంలో శ్రీ సత్యసాయి బాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన నగర సంకీర్తన భక్తిపారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగింది. భక్తులు "ఓం సాయి", "శ్రీ సాయి", "జయజయ సాయి" నామస్మరణతో గ్రామ వీధులను మార్మోగించారు.
షిరిడి సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియా రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగి బస్టాండ్ సెంటర్కు చేరుకుంది. అక్కడ సకల దేవతల స్వరూపంగా భావించే గోమాతకు ప్రత్యేక గోపూజలు నిర్వహించి భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ సత్యసాయి బాబా సేవా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి. నరసింహారావు మాట్లాడుతూ, గోసేవ, గోపూజ చేయడం వల్ల సమస్త పాపాలు నశించి సుఖశాంతులు, మానసిక ప్రశాంతత లభిస్తాయని పురాణాలు పేర్కొన్నాయని తెలిపారు. సమాజంలో ధర్మం, సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, పాశం వెంకటేశ్వర్లు, సుగ్గల విష్ణు, వడ్డెరపు నాగయ్యతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.