చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవం
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
30 లక్షల వ్యయంతో చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్లో పూర్తయిన ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
చింతలపూడి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్లో కల్పించిన సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించి, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO), డిపో మేనేజర్, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.