చింతలపూడిలో నూతన వాటర్ ఫౌంటెన్ ప్రారంభం..
చింతలపూడిలో నూతన వాటర్ ఫౌంటెన్ ప్రారంభం.. ప్రజలతో దద్దరిల్లిన ప్రాంతం
చింతలపూడి, ఏలూరు జిల్లా:
చింతలపూడి పట్టణంలోని మినీ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సినీ మ్యూజికల్ కార్యక్రమాల నడుమ జరిగిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఫౌంటెన్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ, జనసేన నాయకుల చేతుల మీదుగా ఫౌంటెన్ ప్రారంభించారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి ఈ వాటర్ ఫౌంటెన్ నిదర్శనమని, ప్రయాణికులకు, పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో మినీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
చింతలపూడిని ‘బంగారు చింతలపూడి’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.