వేసవికి ముందే ప్రారంభమైన నీటి కష్టాలు
చిట్యాల ప్రజల దాహార్తి.. వేసవికి ముందే ప్రారంభమైన నీటి కష్టాలు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీలో నీటి సరఫరా తీవ్రంగా అంతరాయం కలగడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజల కష్టాలను గుర్తించిన స్థానిక కౌన్సిలర్లు తమవంతు బాధ్యతగా రంగంలోకి దిగారు. మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా వార్డులలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ వార్డులలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే స్పందించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సొంత చొరవతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. తమ వార్డుల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు వారు చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం కౌన్సిలర్ల చొరవతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీరుతున్నప్పటికీ, మున్సిపాలిటీ అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగితే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొనాలని, చిట్యాల పట్టణ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను సరిదిద్ది, వేసవికాలం మొత్తానికి నీటి కష్టాలు రాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.