www.ntodaynews.com
సమస్యల పరిష్కారానికి ‘చలో విజయవాడ’
తెలంగాణ
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ‘చలో విజయవాడ’
NTODAY NEWS: ఏలూరు
మార్చి 4న భారీ ర్యాలీ, మంత్రుల సమక్షంలో సభ
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం లక్ష్యంగా మార్చి 4న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏలూరు జిల్లా అధ్యక్షుడు జబీర్, కార్యదర్శి హరీష్ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా చలో విజయవాడ పోస్టర్ను జిల్లా కమిటీ ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంఘ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు బాలశౌరి మాట్లాడుతూ జర్నలిస్టుల 11 ప్రధాన డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహాలు కేటాయించాలన్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు.
ప్రధాన డిమాండ్లు
జర్నలిస్టుల కోసం గృహ స్థలాలు, గృహాల కేటాయింపు
హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు
ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరణ
ఇతర రాష్ట్రాల తరహాలో పెన్షన్ విధానం అమలు
మీడియా హక్కుల పరిరక్షణకు ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు
కార్పొరేట్ సంస్థల నుంచి ఉచిత విద్య, వైద్యం అందించే చర్యలు
జబీర్, హరీష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చే ప్రభుత్వాలు అమలు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులకు దశలవారీగా వినతిపత్రాలు అందజేశామని తెలిపారు.
కార్యక్రమ వివరాలు
మార్చి 4న ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించి, అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జర్నలిస్టుల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను ఆహ్వానించినట్లు వెల్లడించారు. సభలో జర్నలిస్టుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరనున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా నాయకుడు నారాయణ, సీనియర్ నాయకులు మిల్టన్ ప్రతాప్, సత్యనారాయణ, సతీష్, దెందులూరు నియోజకవర్గ అధ్యక్షుడు రిషి, కార్యదర్శి వెంకట్రావు, ఏలూరు నియోజకవర్గ అధ్యక్షుడు జయరాం, ప్రతాప్, దొరబాబు, మౌనిక, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
#ChaloVijayawada #WorkingJournalists #APWJF #PressRights #JournalistsUnity
Follow us on
Website
Facebook
Instagram
YouTube