చనుబండ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పరిశీలన
చనుబండ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పరిశీలన
చాట్రాయి మండలం చనుబండ ఉన్నత పాఠశాలలో పనిచేయకుండా ఉన్న ఆర్వో ప్లాంట్ను నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సురక్షితమైన మంచినీరు తాగడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు.
ఈ పరిశీలనలో చాట్రాయి ఇంచార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, ప్లాంట్ను సరఫరా చేసిన సంస్థ ప్రతినిధులకు మరమ్మతుల కోసం పలుమార్లు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు మెకానిక్ రాలేదని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
దీనిపై స్పందించిన ఇంచార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి వెంటనే మెకానిక్ను పంపించి ప్లాంట్ను మరమ్మతు చేయాలని ఆదేశించారు. దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు త్వరితగతిన మెకానిక్ను పంపించి ఆర్వో ప్లాంట్ను మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు.