మతసామరస్యాన్ని చాటుకున్న షబానా అజీమ్
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఊర బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ షబానా అజీమ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ నిలువుటద్దంగా నిలుస్తుందని అన్నారు.
ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే బోనాల పండుగకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉందని, సంప్రదాయంగా ఉపయోగించే కొన్ని పదార్థాలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలు ప్రజల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, భక్తులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.