హైదరాబాద్: నీళ్ల కోసం త్వరలో పాదయాత్ర.. లక్ష మంది రైతులతో ప్రాజెక్టుల సందర్శన కేసీఆర్
సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం.. లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ: కేసీఆర్
తెలంగాణలో సాగునీరు, తాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితి, ప్రాజెక్టుల నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. నీళ్ల కోసం త్వరలో పాదయాత్ర చేపడతానని తెలిపారు.
లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సందర్శిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే లక్షలాది మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవచ్చని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ స్పష్టం చేసిన నేపథ్యంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ నీటిని ఎత్తిపోసి రైతులకు అందించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
పాలమూరు ప్రాజెక్టుపైనా అసంతృప్తి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయాల్సిన సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు.
తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయకుండా రైతులు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సాగునీరు, తాగునీటి సరఫరా విషయంలో రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.
ఇక మౌనం వద్దు.. ప్రజల్లోకి వెళ్లండి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, రాష్ట్రం కోసం జరిగిన త్యాగాలను గుర్తుచేసిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని పార్టీ శ్రేణులకు వివరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఇక మౌనం వీడాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించాలని సూచించారు.
నీళ్ల కోసం రైతులతో కలిసి మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందని, త్వరలోనే కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లనున్నామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.