చనుబండకు రూ.1.93 కోట్ల ఆరోగ్య వరం
చనుబండకు రూ.1.93 కోట్ల ఆరోగ్య వరం
చాట్రాయి, ఆగస్టు 4: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి భారీ ఆరోగ్య వరం దక్కింది. రూ.1.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకోనున్న ఈ కేంద్రం ద్వారా చనుబండతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, తల్లి–శిశు సంరక్షణ, సాధారణ వైద్య పరీక్షలు, అత్యవసర చికిత్సలు మరింత చేరువ కానున్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు మరింత ఊతం లభించనుందని అధికారులు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.