వీఏఎస్ ఉద్యోగాల భర్తీ విధానంలో మార్పు.. మళ్లీ ఏపీపీఎస్సీకే బాధ్యత
ఆంధ్రప్రదేశ్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. తొలుత రాత పరీక్ష లేకుండా డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా అకడమిక్ మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. వీఏఎస్ పోస్టుల భర్తీ బాధ్యతను మళ్లీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి అప్పగించింది. దీంతో అభ్యర్థులు రాత పరీక్షకు హాజరై ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో 160 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న వ్యవసాయశాఖ ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో అకడమిక్ పనితీరు, ఉన్నత విద్యాభ్యాసం, సర్వీసు అనుభవం, గ్రాడ్యుయేషన్ అనంతర సీనియారిటీ వంటి అంశాల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు.
అయితే రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టాలన్న నిర్ణయంపై రాజకీయ విమర్శలు వచ్చాయి. వైఎస్సార్సీపీ ఈ విధానాన్ని తప్పుబడుతూ, పరీక్ష నిర్వహించకుండా ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల నియామక ప్రక్రియపై అనుమానాలకు తావుంటుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.
తాజా ఉత్తర్వులతో ఈ నెల 13న జారీ చేసిన అకడమిక్ మెరిట్ ఆధారిత నియామక ఉత్తర్వులు రద్దయ్యాయి. ఇకపై ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించి వీఏఎస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్ష తేదీ, అర్హతలు, దరఖాస్తు విధానం, సిలబస్ తదితర అంశాలపై ఏపీపీఎస్సీ నుంచి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తాజా నియామక విధానాన్ని గమనించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గ్రూప్-1తో పాటు వివిధ శాఖల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, పోలీసుశాఖలో 2,050 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ అయింది.