పెనుగొలను 99వ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జాతీయ పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు.
మునగాకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థమని, ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గర్భిణీల్లో రక్తహీనత సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు. బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లిపాల ఉత్పత్తికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. సీజన్కు అనుగుణంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం వండే ముందు, వడ్డించే సమయంలో, భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతిరోజూ సరైన సమయంలో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. బయట లభించే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో వివిధ పోషక పదార్థాలు, ఆకుకూరలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను మహిళలు, చిన్నారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కే. లింగమ్మ, పి.వి. సాయి లక్ష్మి, ఎం. స్వరూప రాణి, బి. నాగమణి, డి. దివ్యతో పాటు మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.