చత్తీస్గఢ్ ఎంసీబీ జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..
చత్తీస్గఢ్ ఎంసీబీ జిల్లాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం
చత్తీస్గఢ్లోని ఎంసీబీ (మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్) జిల్లా పరిధిలో ఓ మహిళపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు యువకులు మహిళను బలవంతంగా కారులో ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పర్దుంగా అటవీ ప్రాంతంలో నిందితులు ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు శరీరంపై మద్యం పోసి నిప్పంటించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది.
అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో అగ్గిపెట్టె తడిసి మంటలు అంటుకోలేదు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఘటన జరిగి 24 గంటలు గడిచినా నిందితులు ఇంకా పట్టుబడలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.