Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్ట్
అక్రమ అరెస్టులను ఖండించిన డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు
నల్గొండ: NTODAY NEWS
ముఖ్యమంత్రి నాగార్జునసాగర్ పర్యటన సందర్భంగా డీవైఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గాదేపాక సాయి తేజలను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయొద్దు
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని నాయకులు అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.