దారుణం.. 30 సెకండ్లలో 27 సార్లు కత్తితో పొడిచి ఉపాధ్యాయురాలి హత్య
హరియాణా: ఫరీదాబాద్ జిల్లాలోని సిక్రోనా గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 29 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలు సంధ్యను ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే దాదాపు 27 సార్లు కత్తితో పొడిచిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మొత్తం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్లోని సరస్వతి సీనియర్ సెకండరీ పాఠశాలలో సంధ్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం ఎప్పటిలాగే విధులకు హాజరైన ఆమెను కలవాలని చెప్పుతూ అమిత్ (21) అనే యువకుడు పాఠశాల గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లింది. అప్పటికే ముఖానికి ముసుగు ధరించి కాచుకుని ఉన్న అమిత్ ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు.
సీసీటీవీ దృశ్యాల ప్రకారం, ముందుగా ఆమెను బలవంతంగా పట్టుకుని నేలకూల్చిన నిందితుడు, అనంతరం ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత కిరాతకంగా వరుసగా కత్తితో పొడిచాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కేవలం అర నిమిషంలోనే సుమారు 27 సార్లు దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో సంధ్య అక్కడికక్కడే కుప్పకూలింది.
బాధితురాలి కేకలు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు అతడిపైనా కత్తితో దాడి చేయడానికి యత్నించాడు. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి విచక్షణారహితంగా దాడి చేసిన అమిత్ బైక్పై అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి, ఘటన జరిగిన రెండు గంటల్లోనే అమిత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అయితే ఆమె అతనితో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ అమిత్ తరచూ ఆమెను వెంటాడుతూ వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవల సంధ్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదైన తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో, అతడికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సంధ్య ఫిర్యాదును ఉపసంహరించుకుంది.
అయితే అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న అమిత్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందుగానే కత్తి తీసుకుని పాఠశాలకు చేరుకున్న అతడు, సంధ్య బయటకు వచ్చిన వెంటనే దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడైంది.
ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.