దేశినేనిపాలెంలో ఉచిత క్యాన్సర్ గుర్తింపు వైద్య శిబిరం
దేశినేనిపాలెంలో ఉచిత క్యాన్సర్ గుర్తింపు వైద్య శిబిరం
గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు – భారీగా తరలివచ్చిన గ్రామస్తులు
మధిర, ఆగస్టు 4:
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం దేశినేనిపాలెం గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత క్యాన్సర్ గుర్తింపు వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి సోమ అనురాధ ప్రారంభించారు.
శిబిరంలో మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, పురుషులకు గొంతు క్యాన్సర్తో పాటు పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారికి ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అదనంగా గ్రామస్తులకు బీపీ, షుగర్, జ్వరం తదితర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
ఈ సందర్భంగా వైద్యులు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పొగాకు, గుట్కా, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాఖమూడి కృష్ణారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు పృథ్వీరాజ్, ఏఎన్ఎం విజయకుమారి, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రేస్ ఫౌండేషన్ వైద్య బృందం పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు.