డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు.. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి: మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/నూజివీడు, జూన్ 3: రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడుగుర్రాల్లా ముందుకు దూసుకెళ్తున్నాయని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.
రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రుల జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది పుష్కరాల నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించిన మంత్రి, ప్రజలు వాటిని గమనిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని, పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్పై ప్రపంచ పారిశ్రామిక వేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 20 నుంచి 24 లక్షల అవకాశాలు సృష్టించాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే 9.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.
నూజివీడు నియోజకవర్గంలో గత రెండేళ్లలో రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.14.50 కోట్ల వైద్యసాయం నిరుపేదలకు అందించామని చెప్పారు.
స్త్రీశక్తి పథకం ద్వారా నియోజకవర్గంలో 39 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఇందుకోసం ప్రభుత్వం రూ.12.52 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల ఫలితంగా రెండు ఏళ్లలో యూనిట్కు 19 పైసలు ధర తగ్గిందని, మూడేళ్లు పూర్తయ్యే నాటికి రూ.1 నుంచి రూ.1.25 వరకు తగ్గించే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
చంద్రబాబు పాలనలో సాంకేతికతకు పెద్దపీట
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రతి వారం మూడు నుంచి నాలుగు శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహించడంతో పాటు, లబ్ధిదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి పథకాల అమలుపై ఆరా తీస్తున్నారని చెప్పారు.
ఇసుక సరఫరా వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు జీపీఎస్ ట్రాకింగ్, సరిహద్దు చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, నిఘా బృందాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏపీ అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.