పెనుగొలనులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావుకు ఘన నివాళి
పెనుగొలనులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావుకు ఘన నివాళి
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు (సామర్ల వెంకట రంగారావు) 52వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ ఎస్వీ రంగారావు తెలుగు, తమిళ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారని తెలిపారు. పాతాళ భైరవిలో మాంత్రికుడు, మాయాబజార్లో ఘటోత్కచుడు, నర్తనశాలలో కీచకుడు వంటి పౌరాణిక, జానపద పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు.
సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ నర్తనశాల చిత్రంలో కీచకుడి పాత్రకు గాను ఇండోనేషియాలో జరిగిన ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుల్లో ఎస్వీ రంగారావు ఒకరని పేర్కొన్నారు. ఐదుసార్లు భారత రాష్ట్రపతి పురస్కారాలు, నంది అవార్డులు సహా అనేక పురస్కారాలు, సన్మానాలు అందుకుని తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కె. లింగమ్మ, సాయిబాబా యూత్ కమిటీ సభ్యులు ముక్కెర శ్రీకాంత్, మీనుగు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.