డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.200 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్లో సీఐడీ డీఎస్పీ భీంరెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన సోదాల్లో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల సందర్భంగా అధికారులు ఒక డైరీని స్వాధీనం చేసుకోగా, అందులో 15 మంది బినామీల పేర్లు నమోదు చేసినట్లు గుర్తించారు.
ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో భీంరెడ్డికి సంబంధించిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మొత్తం 16 ప్రాంతాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.
అలాగే ఆయన నివాసంలో కేజీ బంగారం, రూ.40 లక్షల నగదు లభ్యమవగా, వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లను కూడా గుర్తించినట్లు సమాచారం.
భీంరెడ్డి 1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. అనంతరం సీఐగా పదోన్నతి పొంది రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. డీఎస్పీగా ప్రమోషన్ పొందిన తర్వాత పటాన్చెరు డివిజన్లో పనిచేసి, ప్రస్తుతం సీఐడీ డీఎస్పీగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో పలు వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించిందని, అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో ఆయన ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
భీంరెడ్డి బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ నరేందర్రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. భీంరెడ్డి, నరేందర్రెడ్డి కలిసి వ్యాపారాలు నిర్వహించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.