డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్..
డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్.. అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్..
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ -2025పై సీబీఐ విచారణకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిపించి, అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయమని మండిపడ్డారు.
పలువురు డీఎస్సీ అభ్యర్థులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. డీఎస్సీపరీక్ష నిర్వహణ, ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీంతో ఎంతోమంది అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరపున వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని.. ఇందుకోసం లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే, విచారణ కమిషన్ ఏర్పాటు చేసి.. ఈ అక్రమాలపై దర్యాప్తు జరుపుతామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని జగన్ ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న జగన్.. ఆ రోజు ఎలాంటి వివాదాలు రాలేదని, అంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామన్నారు. చంద్రబాబు కేవలం16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థుల తరుఫున వారికి ఖర్చులేకుండా తామే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో తొలుత ఒక జీవో ఇచ్చి పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికేట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్న జగన్.. ఆ తర్వాత మరో జీవో ఇచ్చి పరీక్షలు రాయాలని చెప్పారన్నారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లేదన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు.