డీలిమిటేషన్తో దక్షిణాదికి న్యాయం జరుగుతుందా..?
భారతదేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ ఇప్పుడు కీలక చర్చగా మారిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అన్నారు. విసన్నపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ సీట్ల పెంపు లేదా నియోజకవర్గాల సరిహద్దుల మార్పు మాత్రమే కాదని, రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రూపొందిస్తున్న రాజకీయ వ్యూహంగా చూడాలని వ్యాఖ్యానించారు.
లోక్సభ సీట్లు 816కు పెరిగితే ఆంధ్రప్రదేశ్కు 25 నుంచి 38, తెలంగాణకు 17 నుంచి 26 స్థానాలు మాత్రమే పెరుగుతాయని, అయితే మొత్తం ప్రాతినిధ్యంలో దక్షిణాది వాటా గణనీయంగా తగ్గే పరిస్థితి వస్తుందని హరినాథ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ప్రధాని మోడీ, అమిత్ షా హామీ ఇస్తున్నప్పటికీ, ఆ అంశాన్ని చట్టంలో పొందుపరచేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, ఇతర హామీలు ఇప్పటికీ అమలు కాలేదని గుర్తుచేస్తూ, కేంద్రం మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు భారీ లాభం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాల్లో బాధ్యతాయుత విధానాలు అమలు చేశాయని హరినాథ్ తెలిపారు. అలాంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోవడం అన్యాయమన్నారు.
ఎవరూ సీట్లు కోల్పోరని, అందరికీ సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాల్లోనే భారీగా లోక్సభ స్థానాలు పెరుగుతాయని ఆయన ఆరోపించారు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా 1970లో తీసుకున్న విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
భారతదేశం సమాఖ్య స్వభావం కలిగిన దేశమని, అన్ని రాష్ట్రాలకు సమాన గౌరవం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డీలిమిటేషన్ కమిషన్ పారదర్శకంగా పనిచేయకపోతే అది కేంద్రం చేతుల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దేశాన్ని కేవలం జనాభా ఆధారంగా మాత్రమే అంచనా వేయలేమని, అభివృద్ధి, పనితీరు, సమిష్టి బాధ్యతలు కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే దేశ ఐక్యత దెబ్బతినే పరిస్థితి వస్తుందని హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల “జనాభా పెంచిన వారికి బహుమతి, నియంత్రించిన వారికి శిక్ష” అన్న భావన ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.