దోమల బెడదపై సిపిఎం ఆందోళన
దోమల బెడదపై సిపిఎం ఆందోళన – వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై సిపిఎం మండల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దోమల బెడద నుంచి ప్రజలను రక్షించాలంటూ గ్రామ పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించింది.
గత నెల రోజులుగా గ్రామంలో దోమల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావడమే కష్టంగా మారిందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. దోమల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, రాత్రివేళల్లో ఇళ్లలో కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్న పరిస్థితి నెలకొంది.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే దోమలు అధికంగా పెరుగుతున్నాయని నాయకుడు నాగరాజు తెలిపారు. నిల్వ నీరు, శుభ్రత లోపం కారణంగా పరిస్థితి మరింత విషమంగా మారుతోందని అన్నారు.
ఈ నేపథ్యంలో వెంటనే దోమల మందును పిచికారి చేయించి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ గ్రేడ్-6 సెక్రటరీ దాసరి మాధవరావుకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కరెడ్ల ధనలక్ష్మి, గద్దల రామకృష్ణ, వినుకొండ రంగారాణి, ఆడిమల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.