దసరా ఏర్పాట్లపై దుర్గగుడిలో పోలీస్ కమిషనర్ సమీక్ష
దసరా ఏర్పాట్లపై దుర్గగుడిలో పోలీస్ కమిషనర్ సమీక్ష
విజయవాడలో జరిగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అధికారులను ఆదేశించారు.
దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఆలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అనంతరం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ ఏరియాలు, బ్యారికేడ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాలు, కృష్ణానది స్నాన ఘాట్లు, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షలో పశ్చిమ డీసీపీ జి. రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, ఇన్స్పెక్టర్లు గుణరాం, ఉమా మహేశ్వరరావు, దేవస్థాన అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.