ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
రోజుకు 40 నుండి 50 లారీల దిగుమతే లక్ష్యం.. నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి కావాలి
ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, కేటాయించిన రైస్ మిల్లులు, గోదాములకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో కలిసి జైపూర్ మండలం రామారావుపేట లోని సుముఖ గోదామును, హాజీపూర్ మండలంలోని గాయత్రి రైస్ మిల్లును సందర్శించి, ధాన్యం అన్లోడింగ్ అవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలును చేపడుతోందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లులు, గోదాములకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా రైస్ మిల్లులు, గోదాములకు చేరిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేయాలని, ఇందుకోసం రోజుకు కనీసం 40 నుంచి 50 లారీల ధాన్యం దిగుమతి అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ధాన్యం దిగుమతికి సరిపడా హమాలీలను ఇప్పటికే సమకూర్చడం జరిగిందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ నెలాఖరులోగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు