ధ్వంసమైన వాహనంతో వినూత్న అవగాహన.. రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించిన పెదవేగి పోలీసులు
దెందులూరు నియోజకవర్గ రిపోర్టర్ పులువర్తి సంతోష్ కుమార్
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెదవేగి పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న చింతలపూడి–ఏలూరు స్టేట్ హైవే-43 పరిధిలోని పెదవేగి మండలం విజయరాయి గ్రామం వద్ద ప్రత్యేక అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనాన్ని ప్రదర్శనకు ఉంచి, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల కలిగే దారుణ పరిణామాలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు.
"హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం.. మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి" అనే సందేశంతో భారీ అవగాహన బ్యానర్ను ఏర్పాటు చేసి, ద్విచక్ర వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై చైతన్యం కల్పించారు.
అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నాయని పోలీసులు వివరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు.
"సురక్షిత ప్రయాణమే కుటుంబానికి నిజమైన బహుమతి" అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రశంసలు వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు.