కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులను ఆదుకోవాలి
కరువు పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి అన్నారు. కరువు ప్రభావంతో సాగు ముందుకు సాగక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని, పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కరువు పరిస్థితుల్లో రైతులకు హామీలు కాకుండా తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులను పరిశీలించి, నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని తరిమెల వంశీ గోకుల్ రెడ్డి కోరారు.